ఏపిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు భాజపాను మినహాయిస్తే రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసి వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు కూడా మూతపడ్డాయి. లారీ యజమానుల సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్కు మద్దతు తెలిపాయి.

భాజపా మినహా అన్ని పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు కూడా బంద్ను విజయవంతం చేయాలని జిల్లాల్లోని తమ పార్టీ శ్రేణులను ఆదేశించాయి. రాష్ట్ర ప్రభుత్వం బంద్కు సహకరించాలని, మద్దతివ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్నినాని ప్రకటించారు. ఆర్టీసీ బస్సులను కూడా మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిలిపివేస్తున్నట్టు, మధ్యాహ్నం తర్వాత యధాతధంగా తిరుగుతాయని పేర్ని నాని తెలిపారు.

