ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న షుగర్ వ్యాధి పేషేంట్స్ పెరుగుతూనే ఉన్నారు. ఒకసారి ఈ వ్యాధిబారిన పడితే ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేకపోవడంతో జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యంకాదు.
డయాబెటిస్ రోగులకు శాస్త్రవేత్తలు ఒక శుభవార్త చెప్పారు. అదేంటంటే.. వయసు పెరిగే కొద్దీ శరీరంలో పేరుకుపోయే సెనెసెంట్ కణాల (విభజనకు గురయ్యే లక్షణాన్ని కోల్పోయినవి)ను తొలగిస్తే మధుమేహాన్ని తగ్గించవచ్చని కనెక్టికట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఎలుకలపై చేసిన ప్రయోగంలో వారు సఫలమయ్యారు.
ఊబకాయంతో ఉన్న ఎలుకలకు సెనెసెంట్ కణాలను తొలగించే ప్రయోగాత్మక మందులు డసాటనిబ్, క్యుయెర్సెటిన్లు ఇచ్చినప్పుడు వాటి మధుమేహ లక్షణాలు మాయమైపోయాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మింగ్ షూ తెలిపారు. ఊబకాయం, వ్యాయామలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది మధుమేహుల్లో ఇనుల్సిన్ నిరోధకత ఉంటుంది. వాటితోపాటు కొవ్వులో ఉండే సెనెసెంట్ కణాలూ మధుమేహంపై ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని, ఈ కణాలను తొలగిస్తే మధుమేహానికి బ్రేకులు పడ్డాయని మింగ్ షూ వివరించారు.
డసాటనిబ్, క్యుయెర్సెటిన్లను తాము మానవ కొవ్వు కణజాలంపై ప్రయోగించినప్పుడు అందులోని సెనెసెంట్ కణాలు నశించాయని, ఊబకాయుల నుంచి సేకరించిన ఈ కణజాలాన్ని ఎలుకలకు అమర్చినప్పుడు మధుమేహ లక్షణాలు తగ్గాయని చెప్పారు. మానవుల్లో ఈ మందుల ప్రభావం ఎలా ఉంటుందన్నది పరిశీలించేందుకు విస్తృత ప్రయోగాలు చేస్తామని అన్నారు.