ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
సొంత మైదానంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన ప్రతిభ కనపరిచారు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి సత్తా చాటారు.
ఈ నేపథ్యంలో అశ్విన్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. అశ్విన్ తన టెస్టు కెరీర్లో 5 వికెట్లు తీయడం ఓవరరాల్గా చూసుకుంటే 29వ సారి కాగా.. స్వదేశంలో 23వ సారి 5 వికెట్ల ఫీట్ను సాధించారు. కాగా అశ్విన్ స్వదేశంలో 45 టెస్టుల్లో 23 సార్లు 5 వికెట్ల ఫీట్ను అందుకోగా అతని కంటే ముందు లంక నుంచి మురళీధరన్( 45 సార్లు), రంగన హెరాత్(26 సార్లు), టీమిండియా బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే(25 సార్లు) స్వదేశంలో 5 వికెట్ల ఫీట్ను అందుకున్నారు. ఇక ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్వదేశంలో 89 టెస్టులాడి 22 సార్లు 5 వికెట్ల ఫీట్ను అందుకున్నారు.
దీంతో పాటు అశ్విన్ మరో అరుదైన ఫీట్ను సాధించారు. టెస్టు క్రికెట్లో 200 మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లను ఔట్ చేసిన తొలి క్రికెటర్గా అశ్విన్ రికార్డు సృష్టించారు.
ఇందులో డేవిడ్ వార్నర్ను 10 సార్లు, అలిస్టర్ కుక్, స్టోక్స్లను 9 సార్లు, జేమ్స్ అండర్సన్, ఎడ్ కొవాన్లను 7 సార్లు చొప్పున ఔట్ చేశారు. కాగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ ఐదు వికెట్లు తీయడం ద్వారా భజ్జీని అధిగమించి స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇండియా ఆటగాడిగా రికార్డులకెక్కారు.
స్వదేశంలో 45 టెస్టులాడిన అశ్విన్ 268 వికెట్లు తీశారు. ఇందులో 23 సార్లు 5 వికెట్ల చొప్పున, 6 సార్లు పది వికెట్ల చొప్పున సాధించారు. టీమిండియా నుంచి తొలి స్థానంలో లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఉన్నారు. కుంబ్లే 62 టెస్టుల్లో 350 వికెట్లు తీశారు.
ఇందులో 25 సార్లు 5 వికెట్ల ఫీట్, 7 సార్లు 10 వికెట్ల ఫీట్ను అందుకున్నారు. మొత్తంగా చూసుకుంటే అశ్విన్ ఇప్పటివరకు టీమిండియా తరపున 77 టెస్టుల్లో 396 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు, 46 టీ20ల్లో 52 వికెట్లు తీశారు.