కాలుష్యాన్ని తగ్గించి, పాత వాహనాల వల్ల వచ్చే ఆర్ధిక భారాన్ని తగ్గించి వాటిని తుక్కు కిందికి మార్చే స్క్రాపింగ్ విధానాన్ని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ గురువారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటించారు. 15 ఏళ్లపైబడిన వాణిజ్యవాహనాలు, 20 ఏళ్లపైబడిన ప్రైవేటు వాహనాలు అన్ఫిట్గా తేలి, వాటి రిజిస్ట్రేషన్లను తిరిగి పునరుద్ధరించని వాటిని తుక్కుగా మార్చాలని, ఇది అన్ని ప్రభుత్వ వాహనాలకు కూడా ఇది వర్తిస్తుందాని చెప్పారు. జర్మనీ, యూకే, అమెరికా, జపాన్లాంటి దేశాల్లో అనుసరిస్తున్న ప్రపంచస్థాయి విధానాల ప్రకారం దేశంలో వాహన తుక్కు విధానాన్ని అమలుచేయనున్నట్లు, ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా 35వేల మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసారు. కొత్త వాహనాల కొనుగోళ్లు పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.30-40వేల కోట్ల వరకు జీఎస్టీ ద్వారా ఆదాయం పెరుగుతుందని చెప్పారు.
తుక్కుగా మార్చడానికి ఫిట్నెస్ టెస్ట్లో విఫలమై, రెన్యూవల్కు వీలుకాని వాహనాలను ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికిల్గా ప్రకటిస్తారు. అలాంటి వాటిని తప్పనిసరిగా సేవలనుంచి ఉపసంహరించి తుక్కుగా మార్చాల్సిన అవసరం ఉంటుంది. వాణిజ్యవాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ను పునరుద్ధరించకపోతే 15ఏళ్ల తర్వాత తప్పనిసరిగా సేవలనుంచి ఉపసంహరించాలి. ఇలాంటి వాహన వినియోగాన్ని నిరుత్సాహపరచడానికి 15 ఏళ్ల తర్వాత వీటి ఫిట్నెస్సర్టిఫికెట్ ఫీజును పెంచనున్నారు.
ప్రైవేటు వాహనాలు ఏమైనా ఫిట్నెస్లో ఫెయిలై, రిజస్ట్రేషన్ పునరుద్ధరణకు వీలుకాని 20 ఏళ్ల పైబడితే ఆ వాహనాలను కూడా తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ఈ దిశలో ప్రోత్సహించడానికి వీలుగా వీటి రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ఛార్జీలను ఇంకా పెంచనున్నారు.
ప్రభుత్వ వాహనాలు ఏమైనా 15 ఏళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఆర్టీసీ, ప్రభుత్వరంగ సంస్థలన్నింటి వాహనాలను రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం ద్వారా తప్పనిసరిగా వాటన్నింటినీ తుక్కుగా మార్చాల్సిన అవసరం ఉంటుంది.
ఫిట్నెస్ టెస్ట్, స్క్రాపింగ్ సెంటర్ల ఏర్పాటుకు నిబంధనల అమలు చేసే తేదీ 2021 అక్టోబర్ 1 నుంచి గా నిర్ణయించారు. 15 ఏళ్లపైబడిన ప్రభుత్వవాహనాల స్క్రాపింగ్ ప్రారంభం తేదీ 2022 ఏప్రిల్ 1 నుంచి కానుంది. ఫిట్నెస్టెస్ట్ ఎప్పటినుంచి తప్పనిసరి తేదీ భారీ వాణిజ్యవాహనాలకు 2023 ఏప్రిల్ 1 నుంచి మొదలు పెట్టనున్నారు. మిగతా వాహనాలకు 2024 జూన్ 1 నుంచి దశలవారీగా జరగనుంది.
మన దేశంలో ప్రస్తుతం 20 ఏళ్లపైబడిన తేలికపాటి వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లకుమించినవి 34 లక్షలు వరకు ఉన్నాయి. ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని 15 ఏళ్లకుమించిన భారీ వాణిజ్యవాహనాలు 17 లక్షలు ఉన్నాయి. కొత్తవాహనాలతో పోలిస్తే పాతవాహనాలు 10-12 రెట్లు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇప్పుడు ఈ విధానాన్ని అమల్లోకి తేవడం వల్ల కాలుష్య సమస్య తగ్గుతుంది. పాత, లోపభూయిష్టమైన వాహనాల సంఖ్య తగ్గుతుంది. వాహన కాలుష్యాన్ని 25-30% తక్కువ చేయగలుగుతాము. రహదారి భద్రత పెరుగుతుంది. తేలికపాటి ఆధునిక వాహనాలను తేవడం ద్వారా ఇంధన వినియోగసామర్థ్యాన్ని పెంచవచ్చు. తద్వారా ఇంధన దిగుమతుల ఖర్చును తగ్గించుకోవచు. ఎయిర్బ్యాగ్స్లాంటి ఆధునిక భద్రతతోకూడిన వాహనాలను వినియోగదారులు వాడేలా ప్రోత్సహించినట్టు అవుతుంది. ఈ తుక్కు విధానం వల్ల తయారీ, సేవారంగంలో వృద్ధి పెరుగుతుంది. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్ పరిశ్రమకు చౌకధరల్లో ముడిసరుకును అందుబాటులోకి తేవడానికి వీలవుతుంది.
కొత్త వాహన రిజిస్ట్రేషన్ ఫీజును రద్దుచేస్తారు. స్క్రాపింగ్ సెంటర్ నిర్ధారించే పాత వాహనం తుక్కు విలువ మేర కొత్త వాహనం ఎక్స్షోరూం ధరలో మినహాయింపు (దాదాపు 4-6%) ఇస్తారు. రిజిష్టర్డ్ తుక్కు కేంద్రాల ద్వారా వాహనాలను తుక్కుగా మార్చిన వాహన యజమానులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తారు. వ్యక్తిగతవాహనాల రోడ్డుపన్నుల్లో 25%, వాణిజ్యవాహనాల రోడ్డు పన్నులో 15% మేర రాయితీ కల్పిస్తారు.
పాతకారు తుక్కు కింద మార్చి కొత్తది కొంటే కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే… ఉదాహరణకు స్విఫ్ట్డిజైర్ స్థాయికారు తీసుకుందాము.
తుక్కు విలువ: కారు విలువలో 4%= రూ.32,000
తయారీదారు డిస్కౌంట్ 5%= రూ.40,000
రహదారిపన్నులో మూడేళ్లపాటు 25% రాయితీ= రూ.3,000
పాత దాంతో పోలిస్తే నిర్వహణ ఖర్చు దాదాపు సగం తగ్గుతుంది.
కొత్త వాహనం ఇంధన సామర్థ్యం ఎక్కువ కాబట్టి పెట్రోల్, డీజిల్పై చేసే ఖర్చు తగ్గుతుంది.
బెల్జియం మోడల్ ప్రకారం 90% ముడిసరుకును రికవరీ చేస్తే ముడిసరుకు రికవరీ శాతం ఆధారంగా స్క్రాపింగ్ సక్సెస్రేట్ను నిర్ణయిస్తారు. ఇందులోంచి తీసిన వస్తువులను కూడా ఎలక్ట్రానిక్, ఆటోమోటివ్ పరిశ్రమకు ఉపయోగపడేలా తక్కువ ఖర్చుతో రీసైక్లింగ్ చేయాలి. రిజిష్టర్డ్ స్క్రాపింగ్ సెంటర్లలో పార్కింగ్కు తగినంత స్థలం ఉండాలి. గాలి, నీరు, శబ్దకాలుష్యాన్ని నియంత్రించే వ్యవస్థలు ఏర్పాటుచేసుకుని ప్రమాదకరవ్యర్థాలను పూర్తిగా నిర్మూలించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, ఆటోమొబైల్ కంపెనీలు సంయుక్తంగా పీపీపీ విధానంలో స్క్రాపింగ్సెంటర్లు ఏర్పాటుచేసుకోవడం ద్వారా ఖర్చు తగ్గించవచ్చు. దీనికిగాను దేశంలో ప్రతి జిల్లాకొకటి చొప్పున 718 జిల్లాల్లో ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటుచేసి దానిలో వాహనాలను పరీక్షించి ఏవి స్క్రాప్ చేయాలన్నది నిర్ణయిస్తారు.