అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయి ఆదాయాలు తగ్గిన సమయంలో రైలు ప్రయాణికులపై రైల్వేశాఖ అధిక భారం మోపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వే శాఖ రెగ్యులర్ రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు ఒక ప్రకటన చేసింది. ప్రయాణికులు మరో మూడు, నాలుగు నెలల పాటు అదనపు ఛార్జీలతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్ నెలాఖరు వరకు, ఇంకొన్నింటిని జులై తొలివారం వరకు పొడిగించింది. గతేడాది మార్చిలో లాక్డౌన్తో దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తరువాత కొన్ని ట్రైన్లను పునరుద్ధరించారు.
ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో 80శాతానికిపైగా పునరుద్ధరించినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆర్టీసీలు, విమానయాన సంస్థలు మామూలు ఛార్జీలతో రెగ్యులర్ సర్వీసులుగానే నడిపిస్తున్నాయి కానీ రైల్వే శాఖ మాత్రం ‘ప్రత్యేకం’ పేరు చెప్పి అదనపు వసూళ్లు చేస్తుంది. గోదావరి, శబరి, తెలంగాణ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లు అవే బోగీలతో కొవిడ్కు ముందునాటి రూట్లలోనే, అవే సమయాల్లోనే ప్రయాణిస్తున్నాయి. ఆ రైళ్ల పాత నంబర్లకు ముందు ‘సున్నా’ కలపడం ఒక్కటే ప్రత్యేకం. ఉన్నవాటికి అదనంగా నడిపే రైళ్లు ప్రత్యేకం అవుతాయి. కానీ రెగ్యులర్ రైళ్లనే రాయితీలు తీసేసి రైల్వేశాఖ ప్రత్యేకం పేరుతో నడిపిస్తోంది. దసరా, దీపావళి సమయాల్లో కొన్నింటిని పండగ ప్రత్యేక రైళ్లుగా పట్టాలు ఎక్కించింది. వీటిలో ఛార్జీలు పెంచి అదనపు ఛార్జీల కోసం వాటిని ఇప్పటికీ కొనసాగిస్తోంది. కనీసం బెర్త్ లు కేటాయించే విషయంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించకుండానే అన్ని బెర్త్ లు కూడా కేటాయిస్తుంది కానీ వాటికే స్పెషల్ అనే పేరు పెట్టి దోచుకుంటుంది.
ఇక సీనియర్ సిటిజెన్లకు ఇచ్చే రాయితీలు కూడా తీసేసారు. సీనియర్ సిటిజన్లయిన భార్యాభర్తలు ఇద్దరు సికింద్రాబాద్ నుంచి దిల్లీకి థర్డ్ ఏసీలో ప్రయాణించడానికి కరోనాకు ముందు రూ.2,105 ఖర్చయ్యేది. ఇప్పుడు రాయితీ లేకపోవడంతో రూ.4,240 అవుతోంది. రానూపోను రూ.4,270 వరకు పెరిగింది. ఫస్ట్ ఏసీ ప్రయాణం అయితే.. రానూపోను ఇద్దరికి కలిపి రూ.11,900 వరకు అదనపు భారం పడుతోంది. ప్రయాణమార్గం ఏదైనా ఇదే భారం. వీరే కాదు విద్యార్థులు, వికలాంగులు, కళాకారులు.. ఇలా 51 రకాల రాయితీలు పొందేవారందరిపై రైల్వే శాఖ భారం మోపుతోంది. రాయితీలకు అవకాశం లేని సాధారణ ప్రయాణికులనూ పండగ ప్రత్యేక రైళ్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తుంది. ఇప్పటికైనా రెగ్యులర్ రైళ్లను పునరుద్ధరిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న రైలు ప్రయాణికులకు ఇప్పుడు చేసిన ప్రకటన శరాఘాతంలా తగులుతుంది.