సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. పారిశ్రామికవాడలో ఉన్న ఎస్వైఎస్ ఎలక్ట్రానిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాధిక అనే కార్మికురాలు మృతి చెందగా. విజయ్కుమార్ యాదవ్, అన్వేశ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. పరిశ్రమలోని కాయల్స్ వేడి చేసే బ్లాక్లో ఉష్ణోగ్రత పెరగడంతో ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు తెలిపారు. గాయపడినవారిని బాచుపల్లిలోని మమత ఆస్పత్రికి తరలిచారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐడీఏ బొల్లారం సీఐ జి.ప్రశాంత్ తెలిపారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని గోడలు బీటలు వారి, పైకప్పు లేచిపోయినట్లు కార్మికులు తెలిపారు.