కరోనా ప్రజల జీవనశైలిలో పలుమార్పులకు కారణమైంది. అలాగే వైరస్ భయాలు ఇంకా తొలగని నేపథ్యంలో, ఐటీ నిపుణుల్లో ఎక్కువమంది 2021లోనూ ఇంటి నుంచే పనిచేయాల్సి వస్తుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్న స్పష్టం చేశారు.అన్ని రంగాల్లోను పరోక్ష సేవలు వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఆర్డర్లూ పెరేగడంతో తదనుగుణంగా ఆ రంగం మార్పులు చేసుకుంటోంది. అత్యధిక ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’లో ఉండడం ఆ రంగంలోని ప్రధాన పరిణామం. ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదకత ఏమీ తగ్గలేదని రాజన్న తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచి పని మొదలై ఏడాది గడిచింది. ఆఫీసులకు వచ్చి పనిచేస్తామంటూ ఉద్యోగులు చెబుతున్నారని సర్వేలు పేర్కొంటున్నాయి.

హైదరాబాద్ కేంద్రంలో 54,000 మంది ఉద్యోగులున్నారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికై, ఉద్యోగ నియామకం-చేరిక కూడా ఆన్లైన్లో పూర్తిచేసుకున్న వారితో సహా 50,000 మందికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోని స్వస్థలాలకు చేరిన వారికీ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇంటికే పంపాం. ఆర్థికసేవలు, బ్యాంకింగ్ వంటి గోప్యత ఎక్కువ ఉండే రంగాల్లోని కీలకమైన 500 మంది మాత్రమే ఆఫీసులకు వస్తున్నారు కానీ ఇతరులు ఎవరైనా రావాలనుకుంటే అభ్యంతరం ఏమీ లేదు. కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
కొవిడ్ వల్ల అన్ని రంగాల్లో డిజిటలీకరణ పెరిగింది. ఐటీ కంపెనీలకు ఆర్డర్లు ఎక్కువవ్వడంతో నిపుణులైన సిబ్బందికి ప్రోత్సాహకాలు, వేతన పెంపును అమలు చేస్తున్నాం. కోతలు ఏమీ లేవు. కొత్త నైపుణ్యాలు అలవరచుకోని వారికి మాత్రం కష్టం.
ఇంటి వద్ద పని వల్ల అధిక భారం పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారన్న ప్రశ్నకి ఎన్ని గంటలు పనిచేశారన్నది కాదు, ఎంత ఉత్పాదకత సాధించారన్నదే ప్రామాణికం. ఆఫీసులో అయినా, ఇంటి దగ్గరున్నా 9 ఉత్పాదక గంటలు పనిచేయాలి దానికంటే భారం మోపడం లేదు. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు మధ్యలో విరామం తీసుకుంటుంటే, ఎక్కువ గంటలు పని చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇంటి వద్ద పని గతంలో ప్రకటించిన ప్రకారం జూన్ వరకు అయితే తప్పనిసరిగా కొనసాగుతుంది. ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు ప్రాధాన్య మిస్తున్నందునే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందువల్ల 2021లోనూ దాదాపు ఎక్కువ మంది ఇళ్ల నుంచే పనిచేయొచ్చు. అత్యధికులు కుటుంబాలతో తమ స్వస్థలాలకు వెళ్లి, అక్కడి నుంచే పనిచేస్తున్నారు. కొత్తగా నియమితులైన వారికి శిక్షణ, యోగా, ఆరోగ్య సంరక్షణ సూచనల వంటివి ఆన్లైన్లో నేర్పుతున్నాం. ముఖాముఖి కలవడం మినహా ఏ రకంగానూ ఉద్యోగులతో అనుబంధం ఆపలేదు. హైదరాబాద్ సహా దేశంలోని 11 నగరాల్లో టీసీఎస్ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాలు నిర్వహిస్తున్నాం అని రాజన్న వివరించారు.
ఇక మిగిలిన కంపెనీల విషయానికి వస్తే కొవిడ్ రెండో విడత కేసులను గమనిస్తున్న ఐటీ సంస్థలు, ఉద్యోగులకు టీకా వేయించడంపై దృష్టి సారించి విద్యాసంస్థలు ఎలా పనిచేస్తాయో తెలిసే వరకు ఇంటి నుంచి పని కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నాయి. తదుపరి కార్యాచరణను జూన్లో ప్రకటించాలని చూస్తున్నాయి.
ఇప్పటికి మిగిలిన కంపెనీల కార్యాచరణ:
ఇన్ఫోసిస్: కొవిడ్ ముందు కూడా, ప్రాజెక్టు నిబంధనల మేరకు నెలలో 9 రోజులు ఇంటి నుంచి పని చేసే అవకాశమిచ్చారు. గత మార్చి నుంచి పూర్తిగా అనుమతిస్తున్నారు. ఇటీవలి వరకు మేనేజర్ స్థాయి అధికారి సమ్మతితో ఆఫీసుకు వచ్చి పనిచేసుకోవచ్చని తెలిపారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుని, సెక్యూరిటీకి చూపి ఏ ఉద్యోగి అయినా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎవరినీ కార్యాలయానికి రమ్మని మాత్రం సంస్థ తరఫున ఆదేశించడం లేదు.
మైక్రోసాఫ్ట్ ఇండియా: జూన్ ఆఖరు వరకు ఇంటి నుంచి పనికి అనుమతించింది. ఇటీవల 25 శాతం మంది కార్యాలయాలకు రావచ్చని ప్రకటించినా, ఒక శాతం మంది కూడా ముందుకు రాలేదని అధికార వర్గాల సమాచారం.
అసెంచర్: పూర్తిగా ఇంటి నుంచే పనిచేస్తారా, పాక్షికంగా కార్యాలయానికి వస్తారా, పూర్తిగా కార్యాలయానికి వచ్చి పనిచేస్తారా అంటూ ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించి జూన్లో తదుపరి ప్రణాళిక ప్రకటిస్తుందని భావిస్తున్నారు.
అడోబ్: పూర్తిగా ఇంటి నుంచి పనికే ఆదేశాలిచ్చింది.
టెక్ మహీంద్రా: ఇప్పుడు 20 శాతం మంది కార్యాలయాలకు రావచ్చని ప్రకటించింది. కేసుల తీవ్రత ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయించనుంది.
ఫ్యాక్ట్సెట్: ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించి, ఇంటి నుంచి పనిని పొడిగిస్తోంది. జూన్ ఆఖరుకు తదుపరి ప్రణాళికను ప్రకటించనుంది.