వివిధ రంగాల్లో చైనా నుంచి ఎదురవుతున్న పోటీని అధిగమించాల్సిన అవసరం ఉందని అమెరికాలో సెనేట్ మెజారిటీ నాయకుడు చుక్ షుమర్ తెలిపారు. భారత్ వంటి మిత్రదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఈ మేరకు వచ్చే స్ప్రింగ్ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలని కోరారు. తద్వారా అమెరికా పౌరుల ఉపాధిని రక్షించడంతో పాటు కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలని ఆకాంక్షించారు. ఆ దిశగా అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను ఆయన ప్రతిపాదించారు. వీటిని సెనేట్లోని ప్రధాన కమిటీలకు తెలియజేశారు. అందుకనుగుణంగా చట్టబద్ధమైన ప్యాకేజీలను రూపొందించాలని కోరారు.
మూడు లక్ష్యాలను చేరుకునేలా చట్టాన్ని రూపొందించాలని షుమర్ కోరారు. అమెరికా ఆవిష్కరణలు, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి చైనాను ఢీకొట్టేలా అమెరికా పోటీతత్వాన్ని మరింత పటిష్ఠం చేయాలన్నారు. భారత్, ఆగ్నేయాసియా, నాటో వంటి వ్యూహాత్మక, మిత్ర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. అమెరికా ఉపాధిపై దెబ్బకొట్టిన చైనా మోసపూరిత విధానాలను బయటి ప్రపంచానికి తెలియజేసేలా చట్టాలు ఉండాలని షుమర్ ప్రతిపాదించారు.
ప్రస్తుతం అమెరికా సెమీకండక్టర్ ఉత్పత్తి పరిశ్రమ బలహీనంగా ఉందన్నారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, భద్రతకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.కీలక పరిశ్రమల్లో పెట్టుబడులతో పాటు అమెరికా సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటి కోసం విదేశాలపై ఆధారపడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. చిప్ తయారీలో చైనాను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే విపరీత పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.