టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2021 సీజన్లో ఆకట్టుకోలేకపోయి, టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలోనూ రాణించలేకపోయాడు. అటు బౌలింగ్ చేయలేక.. ఇటు బ్యాటర్గా కూడా మెరుగైన ప్రదర్శన కనబరచలేకపోవడంతో బోలెడన్ని విమర్శలపాలయ్యాడు. దీంతో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్కు కూడా పాండ్యా ఎంపిక కాలేదు.
అయితే వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను పూర్తి స్ధాయి ఫిట్నెస్ సాధించినంతవరకు తనను సెలక్షన్లోకి పరిగణించవద్దు అని సెలెక్టర్లను కోరినట్లు సమాచారం.